Thursday 31 December 2015

ఒక్క రాంగ్ కాల్ జీవితాన్ని మార్చేసింది

58054012010

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది… ఇది కొంత మంది వ్య‌క్తుల‌కు నిజ‌మే అయినా.. ఒక్క రాంగ్ ఫోన్ కాల్‌తో ఓ మ‌హిళ పూర్తిగా మోస‌పోయి…ఉన్నంతంతా మోస‌గాడికి ఇచ్చి ఇళ్లు గుల్ల చేసుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే..మెదక్ జిల్లా జోగిపేట‌కు చెందిన మ‌హిళ‌కు ఓ రాంగ్ ఫోన్ కాల్ వ‌చ్చింది. ఆమె ఆ కాల్‌ను లిఫ్ట్ చేయ‌గా ఆ ఫోన్ చేసిన వ్య‌క్తితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం స్నేహంగా మారి ప్రేమ‌కు దారితీసింది. ఆమెను ఎన్నో మాయ మాట‌ల‌తో న‌మ్మించిన ప్రియుడు ఆమె వ‌ద్ద నుంచి రూ. 4.25 ల‌క్ష‌లు తీసుకుని ఉడాయించిన ఘ‌ట‌న బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిలిప్‌చెడ్ గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం శ్రీలతకు ఆరు నెలల క్రితం ఓ రాంగ్‌కాల్‌తో కిశోర్‌బాబు ప‌రిచ‌యం అయ్యాడు. వారి మ‌ధ్య స్నేహం, ప్రేమ‌గా మారింది. తనది విజయవాడ అనీ.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సొంతిల్లు ఉందని చెప్పాడు. ఇటీవల హైదరాబాద్‌లో తాను ప్లాట్ కొంటున్నానని.. రూ. 35 వేలు తక్కువగా ఉన్నాయని.. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయాలని ఒత్తిడి పెంచాడు. జోగిపేట ఎస్‌బీఐలో రూ. 35 వేలు డబ్బు డ్రా చేసి శ్రీల‌త త‌న ప్రియుడికి ఇచ్చింది. అదే స‌మ‌యంలో శ్రీలత ఖాతాలో మరో రూ.3.90 లక్షల వరకు నగదు ఉన్నట్టు గమనించిన అతడు.. అంతలోనే కుట్ర పన్నాడు.సంవ‌త్స‌రం చివ‌రి కావ‌డంతో ఉద్యోగి ఖాతాలో ఇంత డ‌బ్బు ఉండ‌కూడ‌ద‌ని డ్రా చేయించాడు.
అనంత‌రం పక్కనే ఉన్న వెంకటేశ్వర సినిమా థియేటర్‌లోకి సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా మధ్యలోనే బ్యాగులో ఉన్న న‌గ‌దును (రూ.3.90 లక్షలు) కాజేసీ, తనకు ఫోన్ వస్తుందని మాట్లాడి వస్తానంటూ బయటకు వెళ్లి ఉడాయించాడు. 15 నిమిషాల వరకు అతను రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో తన బ్యాగును చూసుకుంది. అందులో డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది. చివ‌రికి త‌న కుటుంబ సభ్యులకు విషయం చెప్పి, బుధవారం జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకులోని వీడియో ఫుటేజీలను పరిశీలించారు. కాగా, అతని సెల్ నంబర్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, శ్రీనివాసరావు పేరు మీద ఉన్నట్లు ఎస్‌ఐ విజయ్‌రావు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కిశోర్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
please share it..

No comments:

Post a Comment